ఆంధ్రప్రదేశ్లో ఐఐటీని నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. 2008-09 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను శుక్రవారం ఆయన పార్లమెంట్లో సమర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ వరుసగా 12 త్రైమాసికాల్లో వృద్ధిరేటు 8.8 శాతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించే విదేశీ పెట్టుబడులను పర్యవేక్షిస్తామని మంత్రి ప్రకటించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలవారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ద్వారా 8756 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అనుక్షణం తనిఖీ చేస్తామని తెలిపారు. రూ. 650 కోట్లతో 6000 హైక్వాలిటీ పాఠశాలలను 2009 సంవత్సరంలో నెలకొల్పుతామని తెలిపారు.