భార్యా బాధితుల సంఘం, భర్తా బాధితుల సంఘం గురించి విన్నాం కానీ.. ఇప్పుడు తాజాగా కోడళ్ల నుంచి రక్షణ కల్పించాలంటూ.. విశాఖ వేదికగా ఓ కొత్త సంఘం వెలిసింది. కోడళ్లపై కోపగించిన ఇద్దరు అత్త, ఆడపడుచులు "అత్తా ఆడపడుచుల రక్షణ వేదిక" పేరుతో ఓ స్త్రీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత సమాజంలో అత్త, ఆడపడుచులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని సంఘం నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
దేశంలోని డొమెస్టిక్ వయెలెన్స్ కేసుల్లో దాదాపు 97 శాతం కేసులు సరైనవి కావని వారు అంటున్నారు. డొమెస్టిక్ వయెలెన్స్ కోసం ఏర్పాటు చేసిన "498 ఎ డొమెస్టిక్ వయెలెన్స్" చట్టానికి వ్యతిరేకంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే సంఘం నిర్వాహకులు మాత్రం ఇది చట్టాన్ని వ్యతిరేకించడానికి కాదని ఇటువంటి కేసుల్లో నిజానిజాలను పరీక్షించి తగన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
డొమెస్టిక్ వయెలెన్స్ చట్టాన్ని ప్రస్తుత తరం కోడళ్లు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఫలితంగా అమాయకపు అత్తలు, ఆడపడుచులు బలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ కేసులు పెట్టడం వల్ల సంబంధం లేకున్నా అరెస్టు చేస్తున్నారని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అత్తలకు, ఆడపడుచులకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు.
అయితే ఈ సంఘం ఏర్పాటుపై పలు స్త్రీ సంక్షేమ సంఘాలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. ఈ సంఘం నిర్వాహకులకు ఇప్పటికే బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వారు తెలిపారు. అయితే.. ఈ సంఘం స్త్రీలకు, చట్టానికి వ్యతిరేకంగా స్థాపించింది కాదని, పూర్తిగా స్త్రీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిందేనని, దీనిని ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దని వారు విన్ననించుకుంటున్నారు.
ప్రతి చిన్న విషయానికి కేసు పెట్టేస్తాం అని కోడళ్లు భయపెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి మిగిలిన వాళ్లు భయపడే విధంగా దీనిని స్థాపించామని "అత్తా ఆడపడుచుల రక్షణ వేదిక" వైస్ ప్రెసిడెంట్ సుధారాణి అన్నారు.
తమ పిల్లలకు పెళ్లి చేసే ముందే వారికి ఆ పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలుసుకొని తల్లిదండ్రులు తగిన కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆమె సూచించారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘాలు వెలిసినంత మాత్రాన నేరాలు ఆగిపోతాయనుకోవడం మాత్రం భ్రమే అనేది విశ్లేకుల అభిప్రాయం. మానవీయ విలువలు తెలుసుకొని మనుగడ సాగిస్తే అంతా శుభం జరుగుతుందనేది పలువురి వాదన.