కామన్వెల్త్ బ్యాడ్మింటన్: సెమీఫైనల్లోకి సైనా నెహ్వాల్!

FILE
కామన్వెల్త్ బ్యాడ్మింటన్ క్రీడాపోటీల్లో భారత ఆశాకిరణం సైనా నెహ్వాల్ సింగిల్స్ విభాగంలో తన హవాను కొనసాగిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించిన సైనా నెహ్వాల్, సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధిస్తుందని అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో, సైనా నెహ్వాల్ కూడా అంచనాలకు అనుగుణంగా రాణిస్తోంది.

ఈ క్రమంలో బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కెనడాకు చెందిన అన్నారాస్‌తో బరిలోకి దిగింది. ఈ పోటీలో ప్రత్యర్థిపై ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించిన సైనా నెహ్వాల్ 21-7, 21-10 పాయింట్ల తేడాతో మట్టికరిపించి, సెమీఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.

ఇదేవిధంగా భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సైతం ధీటుగా రాణిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి పారుపల్లి కశ్యప్ కూడా దూసుకెళ్లాడు. మలేషియాకు చెందిన హఫీజ్‌ను 19-21, 21-19, 21-16 తేడాతో కశ్యప్ ఓడించాడు.

అలాగే చేతన్ ఆనంద్ సైతం క్వార్టర్ ఫైనల్లో గెలుపును నమోదు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని 21-17, 21-9 సెట్ల తేడాతో ఓడించిన ఆనంద్ సెమీఫైనల్లోకి అడుగెట్టాడు. ఇక బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల గుత్తా-షివిని జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

వెబ్దునియా పై చదవండి