తృటిలో చేజారిన స్వర్ణం: తేజస్విని, మీనాలకు కాంస్యం!

భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ మరియు మీనా కుమారిలు స్వర్ణ పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో తేజస్విని సావంత్, మీనా కుమారిలు కేవలం ఒక్క పాయింట్ తేడాతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోలేకపోయారు. ఫలితంగా తేజస్విని, మీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇదే విభాగంలో స్కాట్లాండ్‌కు చెందిన జెన్ మెక్లెన్తోష్ (591), మరియు కే కొప్లాండ్ (578)లు స్వర్ణం సాధించగా, ఇంగ్లీష్ గర్ల్స్ మిచెల్లీ స్మిత్ (590), షరోన్ లీ (579) పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకున్నారు. దీంతో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ 1,169తో టై పాయింట్లు సాధించాయి.

కాగా.. 50 మీటర్ల విభాగంలో ప్రపంచ విజేత అయిన తేజస్విని (583), మీనా (585)లు 1,168 పాయింట్లు సాధించారు. దీంతో ఒకే ఒక్క పాయింట్‌తో తేజస్విని-మీనాలు స్వర్ణ పతకాన్ని కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి