అలసట ఎరుగని ఆదర్శ దంపతులు

మంగళవారం, 7 అక్టోబరు 2008 (13:24 IST)
ప్రత్యామ్నాయ నోబెల్ అవార్డుగా పేరొందిన ప్రతిష్టాత్మక "రైట్ లైవ్లీహుడ్ అవార్డు"ను ఈ మధ్యే సాధించిన కృష్ణమ్మాల్ దంపతులు పనిచేసే విషయంలో వయసు తమకు అడ్డు కాదని ఘంటాపథంగా చెబుతున్నారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన కృష్ణమ్మాల్, జగన్నాథన్ దంపతులు గత 40 ఏళ్లుగా తమ జిల్లాలోని ఓ కుగ్రామంలో జనం సమస్యలపై విరామమెరుగకుండా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యమేస్తుంది.
పదికాలాలపాటు చల్లగా...
  జీవితంలో ఏ ఆకర్షణా, గ్లామర్, ప్రచారాడంబరాలు లేకుండా, అర్ధ శతాబ్దం పైగా ఈ మహనీయ వృద్ధ దంపతులు నిర్వికారంగా, నిరామయంగా చేస్తూ వచ్చిన ఒక మహత్కార్యం ఈ రోజు కొన్ని వేల మంది దళిత మహిళల చేతి భూమిగా, తమ శ్రమతో పండిస్తున్న పంటగా చరిత్రలో నమోదయింది.      


నాగపట్నం జిల్లాలోని కుథుర్ గ్రామంలో జీవిత పర్యంతం పనిచేసిన ఈ వృద్ధ దంపతులు 'దున్నేవాడికే భూమి' సంస్థ ద్వారా 13 వేలమంది పేద దళిత మహిళలకు భూ పంపిణీ చేశారు. జీవిత చరమాంకంలో కూడా మరింతగా పనిచేయగల శక్తి ఉందని, వయసు తమకు అడ్డుకాదని చెప్పడం నివ్వెరపరుస్తుంది.

తాము ఇంకా పనిచేయగలమని, తాము మొదలు పెట్టిన పనిని చాలా శ్రద్ధగా చేస్తామని ధీమాగా చెబుతున్న వీరు సాధారణ బాషలో చెప్పాలంటే కాటికి కాచకునే వయస్సులో ఉన్నారు. ఈ శ్రమైక దంపతులలో కృష్ణమ్మాల్ వయసు 80 ఏళ్లు, భర్త శంకరలింగం జగన్నాధన్ వయస్సు సరిగ్గా నిండు నూరేళ్లు పూర్తి కావడం విశేషం.

తమ పనే తమకు శక్తిని ప్రసాదిస్తోందని ఈ దంపతులు చెబుతున్నారు. అందుకే వయసు తమకొక సమస్యగా లేదని వీరు చెపుతున్నారు. తమ పనిని చివరి వరకూ కొనసాగిస్తామని వీరు అంటున్నారు.

మనుషులు ఎదుర్కొంటున్న తక్షణ సవాళ్లకు ఆచరణాత్మకమైన, ఉదాహరణ పూర్వకమైన సమాధానాలను కనుగొనగల వ్యక్తులను గౌరవించి, బాసటగా నిలిచే లక్ష్యంతో స్వీడన్‌కు చెందిన జాకబ్ వోన్ ఉయెక్స్‌కల్ రైట్ ఈ లైవ్లీహుడ్ అవార్డును 1980లో స్థాపించారు. ఈ సంవత్సరం 3 లక్షల డాలర్ల విలువైన ఈ అవార్డును నలుగురు సమానంగా పంచుకోనున్నారు. ఈ అవార్డు ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతిగా పేరు పొందింది.

1952లో వినోబా భావే తలపెట్టిన భూదాన్ ఉద్యమంలో పాల్గొన్న ఘటన నుంచి ఈ దంపతుల ప్రస్థానం మొదలైంది. వినోబా భావే భూదాన్ ఉద్యమం ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో నలభై లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలలకు పంపిణీ చేశారు. వినోబా భావే మార్గదర్శకత్వంలో ఉత్తర ప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో పనిచేయడం తమ భాగ్యంగా భావిస్తున్నామని శంకరలింగం జగన్నాథన్ ఈ సందర్భంగా చెప్పారు.

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో జీవత కాల సాధన చేసిన ఈ అరుదైన శ్రమైక దంపతులకు రైట్ లైవ్లీహుడ్ అవార్డును బహుకరించిన స్వీడన్ సంస్థ తనను తాను గౌరవించుకుందంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఏ ఆకర్షణా, గ్లామర్, ప్రచారాడంబరాలు లేకుండా, వ్యక్తిగత ప్రలోభాలకు గురి కాకుండా అర్ధ శతాబ్దం పైగా ఈ మహనీయ వృద్ధ దంపతులు నిర్వికారంగా, నిరామయంగా, నిస్వార్థంగా చేస్తూ వచ్చిన ఒక మహత్కార్యం ఈ రోజు కొన్ని వేల మంది నిరుపేద దళిత మహిళల చేతి భూమిగా, స్వంత శ్రమతో తమదైన భూమిలో పండించుకుంటున్న పంటగా చరిత్రలో నమోదయింది.

ఈ వృద్ధ దంపతుల మానవీయ కృషిని మనసారా ఆరాధిద్దాం. జీవితం తుది అంచుల దాకా పయనించిన ఈ వృద్ధమూర్తులకు మనసారా నమస్కరిద్దాం. వందేళ్లు కాదు... పదికాలాల పాటు వీరు చల్లగా ఉండాలని కోరుకుందాం.

వెబ్దునియా పై చదవండి