డబ్బింగ్ కార్యక్రమాల్లో "వ్యాపారి"

WD
ఖుషి, పులి చిత్రాల దర్శకుడు యస్.జె. సూర్య ద్విపాత్రాభినయంలో తమన్నా, నమిత, మాళవిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "వ్యాపారి".

శక్తి చిదంబరం దర్శకత్వంలో తమిళంలో "వ్యాబారి" పేరుతో రూపొంది ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో "వ్యాపారి" పేరిట ప్రణతి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ అనువదిస్తున్నారు.

గతంలో అనేక విజయవంతమైన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసిన కూనిరెడ్డి శ్రీనివాస్, తొలి ప్రయత్నంగా తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దక్షిణాది భాషా చిత్రాల్లో ఇంతవరకు ఎవరూ చేయని విభిన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించడం జరిగిందన్నారు.

ఇంతవరకు క్లోనింగ్ ద్వారా జంతువులను మాత్రమే సృష్టించడం చూశామని, కానీ ఈ చిత్రంలో క్లోనింగ్ ద్వారా మనిషి సృష్టిస్తే అతను ఎటువంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాడన్నదానిని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారని నిర్మాత వివరించారు.
కథానాయకుడు యస్.జె. సూర్య నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు. తమన్నా నటనాపరంగా కాకుండా గ్లామర్‌గా కూడా చాలా కొత్త కనిపించిందని నిర్మాత వివరించారు.

ఇకపోతే.. నమిత, మాళవిక అందాలు కుర్రకారును హుషారెక్కిస్తాయని, నమిత గ్లామర్ ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత వెల్లడించారు. దేవా అద్భుతమైన సంగీతం అందించారని, రీరికార్డింగ్ చాలా బాగా చేశారని కొనియాడారు. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి