మొదటినుంచి 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాపై రీమేక్ అనే ముద్ర ఉంది. బాలీవుడ్లో ఓ చిత్రానికి రీమేక్ చేస్తున్నామని చెబుతూ.. చివర్లో 'గోల్మాల్-3'ని రీమేక్ చేస్తున్నామనడం జరిగింది. కానీ అక్కడవారు కేసు వేయడంతో చివరి నిముషంలో.. ముంబై వెళ్ళి విష్ణు సర్దుబాటు చేసుకుని కోటిన్నరకు సెటిల్మెంట్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ వుంటుందా? లేదా? అనే అనుమానంతో చివరికి శుక్రవారమే రిలీజ్ అయింది. ఏ సినిమా అయినా రీమేక్ చేయాలంటే.. మాతృకలో కొంత తీసుకుని మిగిలింది ఆయా నేటివిటీకి తగినట్లు అల్లేస్తారు. ఈ సినిమా అలాంటిదే.
కథగా చెప్పాలంటే... బ్యాంకాక్లో వుండే నాయుడు(మోహన్ బాబు) తెలుగువారికి టూరిస్ట్గైడ్గా ఉంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు. మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్... ఏదో మాయలు చేసి డబ్బు సంపాదిస్తుంటారు. అక్కడే ఓ రెస్టారెంట్ను నడిపే సత్య(రవీనాటాండన్)కు విష్ణు, వెన్నెల కిశోర్ కొడుకులు. సత్య ఇంట్లో హనీ(హన్సిక) పేయింగ్ గెస్ట్గా ఉంటుంది. ఆమెను సత్య పెద్ద కొడుకు విజయ్(విష్ణు) ప్రేమిస్తాడు.
అక్కడ తల్లిప్రేమ నోచుకోలేదని మనోజ్, ఇక్కడ తండ్రి ప్రేమ నోచుకోలేదని విష్ణులు మథనపడుతుంటే... ఓ సందర్భంలో సత్య, నాయుడు ఇద్దరూ ఒకనాటి ప్రేమికులన్న విషయం హనీకి తెలుస్తుంది. కొడుకులకు ఆ విషయం తెలీకుండా రిజిష్టర్ మేరేజ్ చేస్తుంది. వీరిద్దరి దగ్గర తాము అనాథలుగా పెరిగామని తెలిసి కొట్లాడుకునే పిల్లలంతా ఒకటవుతారు.
ఈలోగా హనీ కోసం ఇండియా నుంచి వెతుక్కుంటూ వచ్చిన గ్యాంగ్ వీరిని కొట్టి.. ఆమెను తీసుకుపోతారు. ఆ సమయంలో హనీ చరిత్ర తెలుసుకుని ఈ పాండవులు ఇండియా వస్తారు. ఇక్కడ కౌరవపురం, పాండవపురం అనే రెండు ఊళ్ల గ్రామ పెద్దలు పేకాట అనే జూదంలో ఓడిపోయిన వారు గెలిచినవారి ఇంటికోడలు కావాలని షరతు పెడతారు. అలా క్రూరులైన కౌరవపురం పెద్ద పాండవపురం ఇంటిపెద్దకు చెందిన హనీని బలవంతంగా తీసుకువస్తారు. ఇక ఇక్కడకు వచ్చిన ఈ పాండవులు.. హనీకి ఎటువంటి సాయం చేశారనేది మిగిలిన కథ.
పెర్ఫార్మెన్స్ మంచు మోహన్ బాబు పాత్ర హుందాగానే ఉన్నా రవీనాతో సాగే డ్యూయెట్ సాంగ్ రికార్డ్ డాన్స్లా అనిపిస్తుంది. నటనలో యాజ్టీజ్గా నటించేశాడు. విష్ణు పాత్ర బాగానే ఉన్నా... తనను ఎక్కువసేపు ఆకట్టుకునేలా లేకపోవడం లోపమే. కొన్నిసార్లు అతిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అతా అలాగే చేసేశారు. మనోజ్ విషయంలో నర్తనశాలలో బృహన్నల గెటప్లా వేసి.. హనీ ఇంటిలోకి ప్రవేశించడం అంతా కామెడీ పండిస్తుంది. వరుణ్ సందేశ్ రొటీన్ పాత్రే. తనీష్... మూగవాడిలా నటించాడు. రవీనా టాండన్ మామూలే. కౌరవుల బ్యాచ్లో ఉండే సుప్రీత్ పాత్ర ఆకట్టుకుంది. బాపుశ్రీ పాత్రలో బ్రహ్మానందం కాస్త నవ్విస్తాడు.
టెక్నికల్గా... ముగ్గురు రచయితలు, ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం విశేషం. పాండవులు పాండవులు తుమ్మెదా.. అంటూ సాగే టైటిల్ సాంగ్ నాటకాల్లో వాడేవిధంగా ట్యూన్ చేశారు. మిగిలిన పాటలు గుర్తుంచుకోవడం కష్టమే. సాహిత్యం కూడా అంతంతమాత్రమే. సంభాషణల పరంగా.. కావాలనే పొలిటికల్ సెటైర్లు వేసి మళ్ళీ కూల్కూల్ అంటూ మోహన్ బాబు చేత చెప్పించిన డైలాగులు బాగానే ఉన్నాయి. ఇండియా మంచిదే. అక్కడ ఉండే పొలిటీషియన్స్ బ్యాడ్.. అంటూ పలికే సంభాషణలు.. జీవితమనే పుస్తకంలో పుట్టుక, చావు పేజీలు దేవుడు ఎప్పుడో రాసేస్తాడు.. అన్న లాజిక్కు ఇందులో బాగానే ఉన్నాయి. మోహిని పాత్ర మిస్ అయినప్పుడు రచయిత వాడిన సంభాషణల చమత్కారంగా ఉన్నాయి.
విశ్లేషణ మంచు మోహన్బాబు తన కొడుకులతో చేసిన సినిమా ఇదే మొదటిది కావడం విశేషం. విష్ణు.. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా తర్వాత చేసిన క్యారెక్టర్ తరహాలోనే... ఓ ఫ్యామిలీకి వెళ్ళి.. అక్కడ వారిని ఫూల్స్ను చేసి హీరోయిన్ను దక్కించుకోవడం అనేది కామన్ పాయింట్. ఇందులో ఆ పాయింట్ను పాండవులు.. నర్తనశాల వంటి కథల్ని ఏదో కొత్త ప్రయత్నం చేశామని చూపించాడు. దీనికి మాతృక 'గోల్మాల్-3' అనే హిందీ చిత్రం. మొదటి భాగమంతా యాజ్టీజ్గా దించేశారు. సెకండాఫ్లో వచ్చేసరికి కొద్ది తెలుగుకథలా అనిపిస్తుంది.
అందుకే మొత్తం పాండవులు బ్యాచ్ అంతా ఓ ఇంటిలోకి ప్రవేశించి అక్కడి వారిని ఫూల్స్ చేయడం వంటి చిత్రాలు చాలానే వచ్చాయి. ఆ ఫార్ములాను నమ్మి భూమి గుండ్రగా ఉందనేట్లుగా చూపించారు రచయితలు. ఇక మోహిని కోసం కౌరవుల పెద్ద కొడుకులు ముగ్గురు కొట్టుకోవడం... ఇంటిపెద్ద.. వంటమనిషి.. రవీనాను సెట్ చేసుకోవడం వంటి పాయింట్లు కామనే. అసలు ఇంత చిత్రవిచిత్రంగా ఉన్న ఆలోచనలు ఆశ్చర్యపర్చినా వారి చేష్టలు మాస్కు నవ్విస్తాయి.
టోటల్గా ప్రేక్షకుల్ని తిమ్మినిబమ్మిని చేసి నవ్విండమే మార్గంగా తీసుకున్న మోహన్బాబు సఫలం అయ్యాడనే చెప్పాలి. కొన్నిచోట్ల ద్వందార్థాలు కూడా దొర్లాయి. పాండవులు ఐదుగురే.. విష్ణు, మనోజ్, వెన్నెల కిశోర్, వరుణ్ సందేశ్, తనీష్.. మరి మోహన్బాబు పాత్ర ఏమిటి? ధర్మరాజులా ముందుండి నడిపిస్తానంటాడు. అక్కడ లాజిక్కు కుదరలేదు. ఏదైనా ఇవన్నీ ఆలోచించకుండా కాలక్షేపం కోసం వెళితే ఓకే.