ఆ వజ్రపు అక్షరాల్ని దొరుకుతున్నప్పుడే ఏరుకోవాలి.. లేదంటే....

గురువారం, 21 జూన్ 2012 (15:57 IST)
WD
పూర్వం ముగ్గురు యువకులు గుర్రాలపై వెళ్తుండగా ఆకాశవాణి ఇలా పలికింది. "ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్లండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీకు ఓ మహాద్భుతం కాచుకుని ఉంటుంది. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు" అంది

ఆకాశవాణి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్లకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్లు తప్ప మరేమీ కన్పించలేదు. అయినా ఆకాశవాణి చెప్పింది కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్లి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు.

మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఆకాశవాణి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు. ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ల ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్లను మూటగట్టక రాలేదెందుకబ్బా అని.

చదువు కూడా అంతే... చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే, ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు.

వెబ్దునియా పై చదవండి