ఆభరణాలను జాగ్రత్తగా వాడుకుంటే చాలాకాలం వస్తాయి. నగలను కొనేటప్పుడు వాటి ధర, నాణ్యత గూర్చి మాత్రమే ఆలోచించడం కాదు వాటిని ఎలా భద్రపరచుకోవాలో కూడా కాస్తంత ఆలోచన చేస్తే అత్యంత విలువైన నగలు మరింత కాలం మన్నికగా ఉంటాయి. అలాంటి నగల భద్రత కోసం కొన్ని సూచనలు మీకోసం.
* ఆభరణాలకు మురికిపడితే పాలిష్ పెట్టించకూడదు. పాలిష్ పెట్టించకుండా రెండు చెమ్చాల సర్ఫ్పౌడర్ను అరగ్లాసు నీటిలో కరిగించి ఆ మిశ్రమంలో బంగారు నగలను ఒక రాత్రంతా నాననిచ్చి తెల్లవారాక బ్రష్తో శుభ్రపరచుకోవాలి. ఆ పిదప క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి.
* 20 గ్రాముల సబ్బుబిళ్లను పాపు లీటరు నీటిలో కరిగించి తర్వాత మరిగించి ఆ వేడినీటిలో 100 గ్రాముల సర్ఫ్పౌడర్ ఒక చెంచా అమ్మోనియా, రెండు చెంచాల మిథిలేటెడ్ స్పిరిట్ కలుపుకొని బాగా కదిలించి చల్లార్చి భద్రపరచు కోవాలి. అవసరమైనపుడు ఈ ద్రవంలో ముంచిన దూదిని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రపరచుకోవచ్చు.
* కుంకుడు కాయలను వేడినీటిలో నాననిచ్చి ఆ నీటిని వంపుకొని వేరుగా ఉంచుకోవాలి. వెండి ఆభరణాల్ని కుంకుడు కాయల్ని నానవేసుకున్న నీటిలో నాననివ్వాలి. ఓ నాలుగు గంటలు పోయాక ఆ ఆభరణాలను తీసి బ్రెష్తో శుభ్రపరిచినట్టయితే మురికి పోతుంది.