సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తూ 13మంది సజీవదహనం

శుక్రవారం, 11 నవంబరు 2016 (19:08 IST)
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 13 మంది అగ్నికి ఆహుతైనారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమవడంతో పేద కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. 12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
గత నెల అక్టోబరులో సాహిబాబాద్‌లోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయాలపాలైనారు. ఈ ఘటన మరవక ముందే వస్త్ర మిల్లులో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నిద్రిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి