జల్లికట్టు 3వ శతాబ్ధంలోనే వుంది.. వెలుగులోకి నాణేలు.. పాండ్యరాజులు ప్రోత్సహించేవారట...

సోమవారం, 23 జనవరి 2017 (16:06 IST)
జల్లికట్టు క్రీడకు ప్రాచీన చరిత్ర ఉంది. పాండ్యరాజులే ఈ క్రీడను  ప్రోత్సహించేవారని తాజా ఆధారాలు నిరూపించాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. జల్లికట్టు సాహస క్రీడ 3వ శతాబ్దంలోనే ఆచరణలో వుందనేందుకు శిలాఫలకాలు, నాణేలు లభ్యమయ్యాయి. ఈ మేరకు దక్షిణ భారత నాణేల పరిశీలన సంస్థ చైర్మన డాక్టర్‌ కృష్ణమూర్తి 3వ శతాబ్దంలో జల్లికట్టుకు సంబంధించిన నాణేల గురించి మీడియాకు తెలియజేశారు. 
 
ఈ నాణెముల్లో ఎద్దును అదుపుచేసే యువకుడి చిత్రం కూడా స్పష్టంగా వుందని, దీనిని బట్టి 3వ శతాబ్దంలోనే జల్లికట్టుతో తమిళులకు అవినావాభావ సంబంధాలున్నాయని స్పష్టమవుతుందన్నారు. మదురైని పాలించిన పాండ్యరాజులు విడుదల చేసిన నాణేలలో తప్పనిసరిగా మత్స్య ఆకారం వుంటుందని ఆయన పేర్కొన్నారు.
 
మూడో శతాబ్ధంలో తమిళ రాష్ట్రాన్ని పరిపాలించిన పాండ్యరాజులు క్రీడను ప్రోత్సహించారని, యువతకు ఈ క్రీడలపై అవగాహన కల్పించేలా ప్రచారం కూడా చేయించారని తెలిపారు. పొగరుబోతు కోడెలను పెంచుకొనేందుకు రాయితీ కల్పించ డంతో పాటు వాటితో పోటీపడి విజయం సాధించే వీరులకు బంగారు నాణేలను బహుమతిగా పంపిణి చేసినట్టు చరిత్ర చెప్తోందన్నారు. 
 
అంతేగాకుండా దేశంలోని కొర్‌కై ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన  హార్బర్ ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందని.. ఇక్కడ లభ్యమయ్యే ముత్యాలను కొనుగోలు చేసేందుకు విదేశాలకు చెందిన వ్యాపారులు ఉత్సాహం చూపేవారని, ముఖ్యంగా రోమ్‌ నగరానికి చెందినవారు పడవల ద్వారా వచ్చివెళ్లినట్టు చరిత్ర చెప్తోందన్నారు. తమ బృందం పురాతన నాణేలపై జరిపిన పరిశోధనలో జల్లికట్టుకు సంబంధించి 3వ శతాబ్దం నాటి నాణేలు వెలుగుచూశాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి