రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన జయలలితను ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుపడక పోవడంతో ఆమెను సింగపూర్ తరలించాలని యోచిస్తున్నారు.
జయలలితకు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మరింత మెరుగైన చికిత్సను అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, జ్వరం తగ్గిందని చెప్పారు. ముఖ్యమంత్రికి సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు పేర్కొన్నాయి.
మరోవైపు జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ తమిళనాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు వారు చేరుకుంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ప్రధాని మోడీ ఆమెకు బొకే పంపించారు. అందుకు జయలలిత స్పందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖ రాశారు.