కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు తూతూ మంత్రంగా 2015-16 రైల్వే బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఒక్కటంటే ఒక్క కొత్త రైలును ప్రవేశపెట్టకుండా ప్రయాణీకులకు మాత్రం జై కొట్టారు. రైల్వే ఆధునీకరణకు దిశానిర్దేశం చేసే లక్ష్యంతో రూపుదిద్దిన ఈ బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకూ కేంద్ర మంత్రి కనీసం నామమాత్రంగా కూడా ఏమీ విదల్చలేదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల రైల్వే అవసరాలను దృష్టిలో ఉంచుకున్నామనే అభిప్రాయం కలిగించడానికి కాజీపేట-విజయవాడల మధ్య మూడోలైన్ వేస్తామని మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. కొత్త రైలు మార్గాలను ప్రకటించకుండా ఒక రైలు మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పించడం ఇదే మొదటిసారి.
టూరిజం కోసం ఒకటి, కిసాన్ యాత్ర కోసం మరొకటి అంటూ మంత్రి కొన్ని కొత్త మాటలు చెప్పారేగాని తక్షణ ప్రయాణికుల అవసరాలను తీర్చే దిశగా మంత్రి నోట ఒక్క మాటా రాలేదు. మంత్రి మధ్య మధ్యలో సాంకేతికాభివృద్ధి గురించి మాట్లాడినా, ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై ఏర్పాటు చేస్తామని చెప్పినా మొత్తం మీద సురేష్ ప్రభు ప్రసంగం చప్పచప్పగా సాగింది.
సాధారణంగా ఏ రాష్టానికి చెందిన మంత్రి ఆ రాష్ర్టానికే కొత్త రైళ్లను, కొత్త రైలు మార్గాలను ప్రకటించడం ఆనవాయితి. అయితే సురేష్ ప్రభు మాత్రం ఏ రాష్ట్రానికీ ఏ ఒక్క వరమూ ప్రకటించలేదు. స్వచ్ఛతకు, భద్రతకూ రైళ్లలో పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర రైల్వే మంత్రి రైలు టికెట్ల ధరలను మాత్రం పెంచడం లేదని ప్రకటించారు.