తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : అభ్యర్థుల్లో 553 మంది కోటీశ్వరులు.. 283 మందిపై నేర కేసులు

బుధవారం, 11 మే 2016 (12:42 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 553మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాగా, 283 మంది నేర చరిత్ర ఉన్నట్టు తేలింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు... స్వతంత్య్రంగా మొత్తం 3,794 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, 997 మంది అభ్యర్థులపై అధ్యయనం జరిగింది. 
 
కోటీశ్వరుల జాబితాలో నాంగునేరి కాంగ్రెస్‌ అభ్యర్థి హెచ్.వసంతకుమార్‌ అగ్రస్థానంలో ఉండగా, అన్నానగర్‌ డీఎంకే అభ్యర్థి మోహన ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే ఇద్దరు అభ్యర్థులు తమ ఆస్తులు సున్నాగా స్వీయ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) అనే ప్రైవేట్ సంస్థ మంగళవారం ఈ సర్వే వివరాలను వెల్లడించింది. 
 
కోటీశ్వరుల్లో అత్యధికంగా 156 మంది అన్నాడీఎంకే అభ్యర్థులు ఉండగా, డీఎంకే కోటీశ్వరుల సంఖ్య 133, బీజేపీ తరపున 64 మంది, పీఎంకే తరపున 72 మంది, డీఎండీకే తరపున 57 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. 
 
అలాగే, నేరస్తుల జాబితాలో డీఎంకే, పీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం తదితర పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 283 మంది ఉన్నారు. వీరిలో 157 మంది శిక్ష అనుభవించి ఇప్పటికీ విచారణకు హాజరవుతున్నారు. డీఎంకే తరపున పోటీ చేస్తున్న 170 మంది అభ్యర్థులలో 68 మంది, పీఎంకే అభ్యర్థులు 66 మంది, అన్నాడీఎంకే అభ్యర్థులు 47 మంది, డీఎండీకేలో 41 మంది, బీజేపీలో 26 మంది, కాంగ్రెస్‌లో 10 మంది, సీపీఎంలో 8 మంది మాజీ నేరస్థులు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి