రూపాయి పతనం - బంగారం రికార్డు : డోంట్ వర్రీ .. చిదంబరం

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:34 IST)
File
FILE
రూపాయి పతనం రోజురోజుకూ మరింతగా దిగజారిపోతోంది. సోమవారం 104 పైసలు కోల్పోయిన రూపాయి మంగళవారం ఉదయం మరో 100 పైసల దాకా నష్టపోయి దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 65.30 పైసలకు చేరింది. ఇది డాలర్‌తో పోలిస్తే రూపాయి మళ్లీ రూ.65.30 పైసలుగా పలుకుతోంది. రిజర్వ్‌ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి.

మరోవైపు.. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం తాపీగా సమాధానం ఇస్తున్నారు. దేశీయ కారణాల వల్లే రూపాయి విలువ పతనమైందంటూ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. మే 22వ తేదీ నుంచి రూపాయిపై ఒత్తిడి తీవ్రంగా ఉందని, పెట్టుబడులు ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, రూపాయి విలువ కూడా సరైన స్థాయికి చేరుకుంటుందని చెప్పారు.

మరోవైపు.. జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో బంగారం ధర 31 వేలకు చేరగా, గత కొన్ని రోజుల నుంచి రూపాయి పతనంతో ధరలు మరింత తార స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం ఒక్క రోజే స్పాట్ మార్కెట్‌లో రూ.600 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 32,512 పలికింది. అటు కిలో వెండి కూడా రూ.700 పెరిగింది.

ఇకపోతే.. రూపాయి పతనంతో స్టాక్‌ మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పడుతూ 18,350కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్ల దాకా కోల్పోతూ 5,410కి సమీపంలో కొనసాగుతోంది. రూపాయి పతనం ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వెబ్దునియా పై చదవండి