కాకినాడ తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరధిలోని గ్యాస్ నిక్షేపాల వెలికితీత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనుల్లో గుజరాత్ పెట్రోలియం, రిలయన్స్ సంస్థలు నిమగ్నమై వున్నాయి. ఈ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ను కాకినాడ వాసులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 340 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.
కాకినాడ పట్టణంలో 28 కిలోమీటర్ల పొడవున ప్రధాన గ్యాస్ లైన్ నిర్మాణం చేపట్టేందుకు సర్వే కూడా పూర్తి చేశారు. ఈ నిర్మాణం ద్వారా ప్రతి ఇంటింటింకి గ్యాస్ కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం ఇప్పటికే గుజరాత్లో విజయవంతం కావడంతో అక్కడకు ఒక ప్రత్యేక కమిటీని పంపి సమీక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది.