నాలుకలు తెగ్గోసే ధైర్యం హరీష్‌కుందా: సోమిరెడ్డి

మంగళవారం, 29 డిశెంబరు 2009 (18:46 IST)
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే సీమాంధ్ర నేతలు, ప్రజలు నాలుకలు తెగ్గోస్తామని తెరాస నేతలు చేస్తున్న రెచ్చగొట్టుడు ప్రకటనలపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా తెదేపా కన్వీనర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెరాస నేత హరీష్‌రావుకు నాలుకలు తెగ్గోసే దమ్ము, ధైర్యం ఉందా ఆయన ప్రశ్నించారు.

తమ స్వార్థ ప్రయోజనాలకు ఉద్యమం నడపటం కాదని, ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేసేలా ఉద్యమాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలపై సోమిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ స్వార్ధ ప్రయోజనాల కోసం చేపట్టిన ఉద్యమం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ వీటితో తనకెలాంటి సంబంధం లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెరాస చేస్తున్న ఉద్యమం వల్ల తెలుగు ప్రజలంతా తీవ్రంగా నష్టపోతున్నారని, రాజధానిపైనా, పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. అలాంటి తెలుగు ప్రజలే ప్రస్తుతం నడి రోడ్డుపై కోట్లాటకు దిగడం కేసీఆర్ పుణ్యమేనని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి