ఆయన కుయుక్తులు ఈనాటివి కావు: జగన్ వర్గీయులు

కాంగ్రెస్ అధిష్టానానికి విధేయత ప్రకటించిన ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డిపై వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గీయులు ఫైర్ అయ్యారు. ఆయన కుయుక్తులు ఈనాటివి కావని వారు ఆరోపిస్తున్నారు. జగన్‌కు తెలియకుండానే కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడినేంటూ లేఖ రాసినపుడే ఆయన మనోగతం అర్థమైపోయిందన్నారు. అది ఈ రోజు ఆయన మాటల్లోనే నిరూపితమైందని వారు అభిప్రాయపడుతున్నారు.

తమ కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ బాబాయ్‌ వివేకాకు పదవుల ఆశచూపి నీచ రాజకీయాలకు పాల్పడిందంటూ కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన బహిరంగ లేఖలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై వివేకానంద ఘాటుగానే స్పందించారు. అధిష్టానంపై మాట పడకుండా చూశారు. తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి మంత్రిపదవి కోసం లాబీయింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై జగన్ వర్గీయులు మండిపడ్డారు. వైఎస్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన వివేకానంద.. ఇపుడు అధిష్టానం చేతిలో పావుగా మారారని ఆరోపించారు. మంత్రిపదవికి ఆశపడిన వివేకా కాంగ్రెస్ అధిష్టానం చేతిలో వివేకా బలిపశువుగా మారారన్నారు. అయితే, ఆయన కుటిల నీతి మూడు నాలుగు నెలల కిందటే పసిగట్టామన్నారు. ఇలాంటి వారు జగన్ వెంట రాకపోవడం వల్ల ఒరిగే నష్టమేమీ లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి