వెళ్లడం.. రావడం... కాంగ్రెస్ పార్టీలో మామూలే: సీఎం కేకేఆర్

తమ పార్టీ నుంచి వీడి వెళ్లడం తిరిగి పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీలో తరచూ జరిగే పరిణామాలేనని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడి వెళ్లినా పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండబోదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోయారని, కొద్దికాలం తర్వాత తిరిగి సొంతగూటికి వచ్చారనే విషయాన్ని మరువరాదన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మామూలేనని, ఇలాంటి వాటివల్ల పార్టీకి ఏమీ కాదన్నారు.

ఏదిఏమైనా.. పార్టీ నేతలు, కింది స్థాయి కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. ఇకపోతే.. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో మార్పులు చేయనున్నట్టు తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మనోధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఇతర రాష్ట్రాల్లో ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో రైతులకు ప్యాకేజీ ఇచ్చామని కేకేఆర్ గుర్తు చేశారు. పది శాతం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ రైతులకు సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు, ప్రభుత్వ ప్యాకేజీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి