నిమ్స్ నుంచి బాబు డిశ్చార్జ్: 30న గుంటూరులో రైతు సభ

శనివారం, 25 డిశెంబరు 2010 (17:23 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిమ్స్ ఆస్పత్రి నుంచి శనివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు బాబుకు దిష్టి తీసి, హారతి పట్టారు. రైతు సమస్యలపై గత ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేసిన విషయం తెల్సిందే. శుక్రవారం రాత్రి మూడో కూటమి నేతలు వచ్చి బాబుకు నచ్చజెప్పి దీక్షను విరమింపజేశారు.

ప్రస్తుతం ఆయన తీవ్రమైన వంటి నొప్పులతో బాధపడటంతో పాటు.. బాగా నీరసంగా ఉన్నారు. ఆయన కోలుకోవడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని, పూర్తి విశ్రాంతి అవసరమని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ మధ్యలో ఎలాంటి బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించరాదని వైద్యులు సూచన చేశారు. అయితే, ఈనెల 30వ తేదీన గుంటూరులో భారీ ఎత్తున రైతు సదస్సు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీనికి అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి