తన రాజీనామా వార్తలు అవాస్తవం: నాగం జనార్థన్ స్పష్టీకరణ

శనివారం, 1 జనవరి 2011 (15:51 IST)
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి తాను రాజీనామా చేయనున్నట్టు మీడియాలో వస్తున్నవార్తలు అవాస్తమని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మీడియా వార్తలపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తానని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిలో నిజంలేదన్నారు. తాను పార్టీని సమన్వయం చేయలేనప్పుడు రాజీనామా గురించి ఆలోచిస్తానే, ఇపుడు కాదన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవటానికి మా ప్రయత్నాలు మేం చేస్తున్నామన్నారు. జనవరి ఆరో తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో జస్టీస్ శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో పేర్కొన్న అంశాలు వెలుగు చూస్తాయన్నారు. ఆ నివేదికలో తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆ రోజు నుంచే ఆందోళన చేస్తామని ఆయన ప్రకటించారు.

రాజీనామాలే తెలంగాణకు పరిష్కారం కాదని, తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని నాగం గుర్తు చేశారు. ఇకపోతే.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయన్నారు.

వెబ్దునియా పై చదవండి