అబ్బే.. మా మధ్య విభేదాలు లేవు.. మేమంతా ఒక్కటే: కేకే
సోమవారం, 10 జనవరి 2011 (18:38 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతల విశ్వసనీయతను ఆ ప్రాంత ప్రజలు శంకిస్తున్నారు. ఇదే అంశంపై మీడియాలో ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. పైపెచ్చు.. టి కాంగ్రెస్ నేతల్లో విభేదాలు పొడసూపినట్టు వార్తలు వస్తున్నాయి.
వీటిపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తన, తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు.
తెలంగాణలో హైదరాబాద్ ఒక భాగమని అన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందించిన తర్వాత నగరానికి వచ్చిన కేకేతో పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.
ఇదిలావుండగా, భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను రచించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మంగళవారం మధ్యాహ్నం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం సికింద్రాబాద్లోని కేజేఆర్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుందని ఆ ప్రాంత సీనియర్ నేత యాదవ్ రెడ్డి సోమవారం వెల్లడించారు.