తెలంగాణ వాదులు దుశ్చర్య: ఆంధ్రా బస్సుకు నిప్పు!

బుధవారం, 28 సెప్టెంబరు 2011 (11:16 IST)
తెలంగాణవాదుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో తిరిగే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రైవేటు బస్సులపై దాడులు చేస్తూ నిప్పు అంటిస్తున్నారు. తాజాగా, నల్గొండ జిల్లా గుంపుల తిరుమలగిరి సమీపంలోని తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సును తెలంగాణవాదులు దగ్ధం చేశారు.

ఈ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఎస్వీఆర్ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించారు. ఈ బస్సును బుధవారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఒకపక్క సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతుంటే బస్సులను తిప్పుతారా నానా బూతులు తిడుతూ బస్సులోని ప్రయాణికులను కిందకు దించేసి నిప్పు అంటించారు.

ప్రయాణికుల్ని కిందకు దించివేసి అనంతరం బస్సుపై పెట్రోలు చల్లి నిప్పు అంటించటంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు. అక్కడ నుంచి ప్రయాణికులు తమకు దొరికిన వాహనం ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి