చంద్రబాబు ముమ్మాటికీ సమైక్యవాదే : నాగం జనార్ధన్

శనివారం, 31 డిశెంబరు 2011 (17:24 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మాటికీ సమైక్యవాదేనని తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెదేపాకు చెందిన తెలంగాణ ప్రాంత నేతలు చంద్రబాబు మార్గదర్శకత్వంలో పయనిస్తున్నారు.

అందుకే తాము చంద్రబాబును ముమ్మాటికీ సమైక్యవాదిగా పేర్కొంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా తెలంగాణపై తన వైఖరిని తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో ఎన్ని రకాల పర్యటనలు చేసినా చంద్రబాబును విశ్వసించరన్నారు.

ఇకపోతే తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం చేస్తున్న ప్రకటనలు అర్థరహితమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా చిదంబరం కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేయకపోవడాన్ని నాగం తప్పుబట్టారు.

వెబ్దునియా పై చదవండి