తమ్మినేని సీతారాం : టీడీపీ చీఫ్ చంద్రబాబు చరిత్ర హీనుడు

సోమవారం, 26 ఆగస్టు 2013 (08:52 IST)
File
FILE
తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నేత తమ్మినేని సీతారాం షాకిచ్చారు. టీడీపీకి గుడ్‌బై చెపుతున్నట్టు ప్రకటించారు. పనిలోపనిగా పార్టీ అధినేత చంద్రబాబును చరిత్ర హీనుడుతో పోల్చారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పార్టీలో ఉండటం కంటే ఇంట్లో కూర్చోవడం మేలన్నారు. అందుకే పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

తన రాజీనామా లేఖపై ఆయన ఆదివారం ఒక లేఖను విడుదల చేస్తూ అందులో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే చచ్చిపోతావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతాలను గాలికొదిలేసి ఆత్మగౌరవ యాత్ర అంటున్నావా అని నిలదీశారు. చంద్రబాబూ... లక్ష పాదయాత్రలు చేసినా, కోటి పోర్లు దండాలు పెట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరు అని ఘాటుగానే వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ రెండు కళ్ల సిద్ధాంతం అని ఆ రెండు కళ్లలో ఏ కన్నును మిగిలించుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారంటూ దుయ్యబట్టారు. అన్నదమ్ముల్లా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీసి పాలిస్తున్నారని కాంగ్రెస్‌, యూపీఏలపై ద్వజమెత్తారు. రాష్ట్రాన్ని రావణకష్టంలా మండిస్తూ యువరాజుకు పట్టాభిషేకం చేస్తారా అని నిలదీశారు. తెలుగుప్రజల కోసం ఎన్టీఆర్ పార్టీపెడితే.. చంద్రబాబు తన కుమారుడి కోసం పార్టీని నడిపిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.

వెబ్దునియా పై చదవండి