ఏపీఎన్జీవో ఉద్యోగులపై హైకోర్టు సీరియస్ : ఢిల్లీ టూర్

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:35 IST)
File
FILE
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసేందుకు ఏపీఎన్జీవోలు ఢిల్లీకి చేరుకున్నారు. వారికి టీడీపీ సీమాంధ్ర ఎంపీ సుజనా చౌదరీ మంగళవారం అల్పాహార విందు ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు.. వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలను కలిసి విభజనను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.

మరోవైపు... రాష్ట్ర విభజనకు నిరసనగా ఏపీఎన్జీవోలు చేపట్టిన నిరవధిక సమ్మెపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమ్మెను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సెప్టెంబర్ 2వ తేదీకి రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలంటూ ఏపీఎన్జీవోలు కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ప్రతి పౌరుడూ తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని హితవు పలికిన హైకోర్టు, గడువులోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్జీవోలకు హెచ్చరించింది. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధుడై ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సమ్మె చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేదానినే పరిశీలనలోకి తీసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి వెల్లడించాలని హైకోర్టు కోరింది.

వెబ్దునియా పై చదవండి