శైలజానాథ్‌పై శివాలెత్తిన ఎమ్మెల్సీ శమంతకమణి!

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (14:42 IST)
File
FILE
రాష్ట్ర మాజీ మంత్రి శైలజానాథ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి శివాలెత్తారు. సభ్యత్వం లేకున్నా సిగ్గు లేకుండా టీడీపీ తరపున పోటీ చేయడానికి వచ్చావా అంటూ శైలజానాథ్‌ను ఆమె నిలదీశారు. శనివారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిగా తహశీల్దారు కార్యాలయంలో శైలజానాథ్ నామినేషన్ దాఖలు చేస్తుండగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో దూషించారు.

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి.. ఇప్పుడు మా పార్టీ తరపున దొంగ బీ-ఫాంతో నామినేషన్ వేయాలని వచ్చావా..? చంద్రబాబు, సీఎంరమేష్ మాకు నామినేషన్ వేసుకోవాలని సూచించారు. మా అమ్మాయి యామిని బాల నామినేషన్ వేస్తున్నారు. అయితే, బీ-ఫాం నాకిచ్చారని డ్రామా ఆడుతున్నావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

దీంతో ఖంగుతిన్న శైలజానాథ్ చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ వేసి బయటకు వచ్చారు. శైలజానాథ్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చి వెంటనే వెనక్కు తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఆయన స్పందిస్తూ... తనకు ఇతర పార్టీల నుంచి ఒత్తిళ్లు, బీ-ఫాంలు వచ్చినా చివరకు కాంగ్రెస్ పార్టీ తరపునే శింగనమల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశానని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి