కేసీఆర్ గుండెల్లో ఓటమి భయం : వెంకయ్య నాయుడు

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (17:21 IST)
File
FILE
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుండెల్లోఓటమి భయం నెలకొందని, అందువల్ల ఆయన తమ పార్టీపైనా, టీడీపీ - బీజేపీ పొత్తుపైనా అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లుతున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు.

ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత్యంతరం లేకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఆలస్యానికి, వెయ్యి మంది బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్‌లదే బాధ్యత అని ఆరోపించారు.

ఓటమి భయంతోనే కేసీఆర్ బీజేపీపై బురద చల్లుతున్నారని వెంకయ్య అన్నారు. బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ఎందుకు ముందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు కింద పనిచేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

బీజేపీ - టీడీపీది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను వెంకయ్య తప్పుపట్టారు. గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కేసీఆర్ మరచిపోతే ఎలా అని ఆయన చురకలంటించారు. ఆయన పెట్టుకుంటే పవిత్ర పొత్తు.. ఇతరులు పెట్టుకుంటే అపవిత్ర పొత్తు అవుతుందా అని నిలదీశారు.

వెబ్దునియా పై చదవండి