జగన్ సైకో... పచ్చి అబద్ధాలకోరు... బీఎండబ్ల్యూ, స్కార్పియో కార్లున్నా లేవని....

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (12:10 IST)
WD
జగన్ మోహన్ రెడ్డి పెద్ద సైకో అనీ, పచ్చి అబద్ధాలకోరు అని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆస్తులు దోచుకునేందుకు తెగ ఆరాటపడిపోతున్నాడని విమర్శించారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ... తమ్ముళ్లూ మీ ముందు రెండు దారులున్నాయనీ, రైట్ తిరిగితే అభివృద్ధిని కట్టబెడుతూ ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం పార్టీ ఉన్నదనీ, అదే లెఫ్ట్ తిరిగితే అడవి వస్తుందనీ, అదే వైకాపా అన్నారు. ఆ అడవిలోకి వెళితే పాములు, క్రూర జంతువులు ఉంటాయనీ, ఇక బయటపడే ప్రశ్నే లేదన్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో జగన్ చూపిన ఆస్తులు తక్కువ చేసి చూపించాడని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్ మోహన్ రెడ్డికి రెండు కార్లు ఉన్నా... తనకు సొంత వాహనం లేదని పచ్చి అబద్ధాలు పేర్కొన్నారంటూ మండిపడ్డారు. జగన్ పేరిట విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బీఎండబ్ల్యూ ఎక్స్ 5 నల్లరంగు కారు ఏపీ 09 బీఎన్ 2345 ఉన్నదన్నారు.

ఇంకా జగన్ పేరిట ఏపీ 09 బీవీ1229 స్కార్పియో వాహనం కూడా ఉన్నదనీ, ఇది కూడా నల్లరంగు వాహనమని చెపుతున్నారు. రెండు వాహనాలు ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్టరయి ఉన్నా జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలా ఆస్తుల విషయంలోనే పచ్చి అబద్ధాలాడే వ్యక్తి ఇక ప్రజలకు ఏం చేస్తారండూ విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి