అక్క పురంధేశ్వరికి ప్రచారం చేయను : బాలకృష్ణ

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:29 IST)
File
FILE
భారతీయ జనతా పార్టీ తరపున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అక్క, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి మద్దతుగా ప్రచారం చేసే ప్రసక్తే లేదని సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే రాజంపేటలో ప్రచారం చేయాలని భావించానని, కానీ, పార్టీ నుంచి తనకు ఎలాంటి సంకేతాలు రాలేదన్నారు. అందువల్ల రాజంపేటలో పురంధేశ్వరికి అనుకూలంగా ప్రచారం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇకపోతే.. యువ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అవసరం లేదేమోనని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రమే కాదు ఏ ఒక్కర్నీ టీడీపీ తరపున ప్రచారం చేయమని కోరబోమని తెలిపారు. తమ పార్టీకి స్టార్ కాంపైనర్ ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనని బాలకృష్ణ తేల్చి చెప్పారు.

రెండు ప్రాంతాల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు అందరినీ ఏకతాటిపై తీసుకెళ్లే నాయకుడన్నారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, బాబే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తను పోటీ చేస్తున్న హిందుపురం స్థానం తమ కుటుంబానికి వరమన్నారు. ఈ స్థానం నుంచి తాను భారీ మెజార్టీతో గెలుస్తానని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి