కర్నూలు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి గురువారం మధ్యాహ్నం 11.05 గంటలకు కన్నుమూసినట్టు హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
ఆమె మృతితో భూమా కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రాజకీయ నాయకురాలిగా ఎంతో పేరు తెచ్చుకున్న శోభానాగిరెడ్డికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఆమెలో ఎక్కువగా ఉండేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు.
అందువల్లే తన తదనంతరం తన కళ్లతో మరో ఇద్దరు ప్రపంచాన్ని చూడటానికి... తన కళ్లను ఆమె భర్త భూమా నాగిరెడ్డి దానం చేశారు. కేర్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన విజ్ఞప్తి మేరకు డాక్టర్లు ఆమె కళ్లను సేకరించారు.