రెడ్ నోటీసు రాలేదు : కేవీపీ... ఆయనే స్పందిస్తారు : శర్మ

గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:36 IST)
File
FILE
టైటానియం స్కామ్‌లో ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు తనకు అందలేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెప్పారు. టైటానియం స్కామ్‌లో షికాగో ఫెడర్ కోర్టు అభియోగాలను ఈయన ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.

ఆయన అరెస్టుకు ఎఫ్.బి.ఐ చర్యలు చేపట్టిందనే వార్తలు రావడంతో ఆయనను కాంగ్రెస్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణలు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారితో కేవీపీ పై విధంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ఇదిలావుండగా, టైటానియం కుంభకోణంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావే స్పందిస్తారని కేంద్రమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన ఆయన, దోషి అని తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు.

టైటానియం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ ఆత్మ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ బుధవారం జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని టైటానియం ఖనిజాన్ని విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిన కుంభకోణంలో కేవీపీ కీలక నిందితుడంటూ అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఓ అంతర్జాతీయ కుంభకోణానికి తమ భూభాగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలతో కేవీపీ సహా మరో ఐదు మందిపై షికాగో ఫెడరల్ కోర్టు అభయోగాలు మోపిన విషయం తెల్సిందే. దీంతో కేవీపీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.

ఇదిలావుండగా, అమెరికాకు చెందిన అధికారులు (ఎఫ్‌బీఐ) ఢిల్లీ చేరుకున్నారని... సీబీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారని పీటీఐ తెలిపింది. భారతీయ చట్టాల పరిధిలోనే కేవీపీని అరెస్ట్ చేసే యోచనలో అమెరికా అధికారులు ఉన్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి