ఆస్ట్రేలియాలో భారతీయ డ్రైవర్ ఆచూకీకి రూ.57 లక్షల రివార్డ్!

బుధవారం, 8 ఆగస్టు 2012 (15:28 IST)
గత 2008 సంవత్సరం అక్టోబరు నెలలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన భారతీయ డ్రైవరు ఆచూకీ తెలిపిన వారికి 57 లక్షల రూపాయల రివార్డును ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటించారు. ఒక విదేశీ డ్రైవరు ఆచూకీ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంత మొత్తంలో నజరానా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

భారత్‌కు చెందిన పునీత్ (19) అనే యువకుడు గత 2008 అక్టోబరు నెలలో సౌత్‌బ్యాంక్‌లోని నగరంలో కారు నడపడం నేర్చుకుంటుండగా అదుపుతప్పి క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఇద్దరు పాదచారులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, పునీత్‌ను కోర్టులో హాజరుపరిచారు.

బెయిల్‌పై విడుదలైన పునీత్, ఆగస్టు 2009లో కోర్టు విచారణకు హాజరుకాలేదు. అయితే ఆ ఏడాది జూన్ 12నే పునీత్ తన స్నేహితుని పాస్‌పోర్టు సాయంతో దేశం విడిచి వెళ్ళిపోయాడని పోలీసులు గుర్తించారు. పునీత్‌కి పాస్‌పోర్టు ఇచ్చిన అతని స్నేహితుడికి కోర్టు రెండున్నర సంవత్సరాల శిక్ష విధించింది. పునీత్ ఆచూకీ కోసం పోలీసులు గాలించినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో మంగళవారం రివార్డు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి