దక్షిణకొరియాలో జరిగిన ఓడ ప్రమాదంలో వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు దేశాధ్యక్షురాలు పార్క్ గిన్హై, ప్రధాన మంత్రి చంగ్హాంగ్ వాన్లపై మండిపడుతున్నారు. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 14 మృతదేహాలు లభించాయని అధికారులు వెల్లడించారు.
గల్లంతైన 282మందిలో ఎవరూ జీవించే అవకాశం లేదని, వారంతా నౌకలోనే చిక్కుకుపోయి మరణించి ఉంటారన్న ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాదం జరిగిన జిందో ద్వీపం సమీపంలోని వ్యాయామశాలలో బాధితుల బంధువులు, తల్లిదండ్రులు వచ్చి చేరారు. వారిని పరామర్శించేందుకు గురువారం వచ్చిన ఆ దేశ ప్రధానమంత్రిపై వాళ్లు నీళ్లబాటిళ్లు విసిరికొట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నౌక మునిగిపోయే సమయంలో దాంట్లో 475మంది ఉన్నారు. వీరిలో విద్యార్థులు 325మంది. నౌకలోంచి 179 మంది ప్రాణాలతో బయటపడ్డారు.