కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మరో బీహారే: శరద్ యాదవ్

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు తీరని నష్టం చేస్తుందని జనతాదళ్ యు అధినేత శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. మున్ముందు బీహార్‌లో ఉత్పన్నమైన పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదురుకానుందనీ ఆయన అన్నారు.

జగన్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ జగన్ రాజీనామా కాంగ్రెస్‌కు ప్రమాదమని, దేశంలో యూపీఏ అధికారంలోకి రావటానికి బలాన్ని, బలగాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా అభిప్రాయపడ్డారు.

ప్రధానంగా కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రంగా ఉంటూ వచ్చిన ఏపీలో పార్టీ నుంచి జగన్ బయటికివెళ్లటం వల్ల ఆ పార్టీ ఓటు బ్యాంకు బాగా దెబ్బతినే అవకాశాలున్నాయన్నారు. ఈ ప్రభావం మున్ముందు తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఇదే తరహా అభిప్రాయాన్ని సైతం పలువురు వామపక్ష నేతలు కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి