జేపీసీ డిమాండ్: భాజపాయేతర పార్టీలతో స్పీకర్ చర్చలు!!

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో కోరుతున్న నేపథ్యంలో.. భాజపాయేతర పక్షాలతో స్పీకర్ మీరా కుమార్ చర్చలు జరిపారు. వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలను సాఫీగా సాగేందుకు వీలుగా ఆమె అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

గత గురువారం ప్రభుత్వం, భాజపా నేతలతో సమావేశమైన ఆమె శుక్రవారం బీజేపీయేతర పార్టీలతో భేటీ అయ్యారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, విపక్షాలతో రెండు రోజులపాటు చర్చలు జరపడం ఓ ముందడుగని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారంలో కొంచెం పురోగతి సాధించామని ఆమె వెల్లడించారు.

వచ్చే సమావేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని అన్ని పార్టీల నేతలూ అభిప్రాయపడ్డారన్నారు. ఈ భేటీకి హాజరుకాని వారితో మరోసారి సమావేశమవుతానని ఆమె తెలిపారు. ఈ సమావేశానికి భాగస్వామ్య పార్టీలైన తృణమూల్ కాంగ్లెస్, ఎన్సీపీలతో సహా ఆరు పార్టీలు దూరంగా ఉండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి