ఆహార భద్రతా బిల్లుకు లోక్‌సభ ఓకే : సోనియా లేకుండానే

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:19 IST)
File
FILE
ఆహార భద్రతా బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మానస పుత్రికగా అభివర్ణిస్తున్న ఈ బిల్లు ఆమోదం ఆమె సభలో లేకుండానే జరిగిపోవడం గమనార్హం. 9 గంటలపాటు చర్చ జరిగిన తర్వాత... రాత్రి 11 గంటల సమయంలో మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది.

సోమవారం ఆహార భద్రతా బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో ఆమె కూడా పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు ప్రసంగిస్తున్న సమయంలో అంటే రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమెకు ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బిల్లుపై ఆమోదముద్ర వేశారు.

ఈ బిల్లు చర్చా సమయంలో విపక్ష సభ్యులు దాదాపు 300 సవరణలు ప్రతిపాదించారు. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ యూపీఏ-2 ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో పాటు.. ఎస్పీ, బీఎస్పీ కూడా మద్దతు తెలుపడంతో సులభంగా ఆమోదముద్ర పడింది.

కాగా, ఈ బిల్లు వల్ల యేడాదికి రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనివల్ల దేశ జనాభాలో 82 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. పథకం అమలుకు నోచుకున్న తర్వాత 6.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి