గంగామాత పిలిచింది... వారణాసికి వచ్చాను : నరేంద్ర మోడీ

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (09:00 IST)
File
FILE
తనను పవిత్ర గంగామాత ఇక్కడకు రమ్మని పిలిచిందని, అందుకే వారణాసికి వచ్చినట్టు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్న మోడీ.. గురువారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసి పట్టణం పూర్తిగా కాషాయవర్ణమైంది. కాషాయ వస్త్రధారులైన కార్యకర్తలు, అభిమానులతో కాశీ వీధులు కిక్కిరిసిపోయాయి. ఓపెన్ టాప్ ట్రక్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ మోడీ ముందుకుసాగారు. కొన్ని ప్రాంతాల్లో ఆయనకు మైనార్టీలు కూడా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్నెవరో పంపితేనో, నా అంతట నేనో ఇక్కడికి రాలేదని అనుకుంటున్నాను. గంగామాత పిలవడం వల్లే ఇక్కడికి వచ్చాను. తల్లి ఒడిలో చిన్న పిల్లాడి అనుభవం కలుగుతోంది. ఈ పట్టణానికి సేవ చేయడానికి శక్తినివ్వమని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు.

పురాతన ఆధ్యాత్మిక నగరమైన కాశీని ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తన వెబ్‌సైట్లో పేర్కొన్నారు. కొన్ని క్లిష్టమైన పనులు నెరవేర్చడానికి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. క్లిష్టమైన పనులు పూర్తి చేసేవాడిని దేవుడు మెచ్చుకుంటాడు. నన్ను దేవుడు అందుకే ఎన్నుకున్నాడని అనుకుంటున్నాను. నాకు మీ ఆశీర్వచనాలు ఇస్తే క్లిష్టమైన పనుల్ని సున్నితంగా పూర్తి చేస్తాను అని తన బ్లాగులో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి