నరేంద్ర మోడీ భావోద్వేగం.. అద్వానీ గురించి మాట్లాడుతూ..!

మంగళవారం, 20 మే 2014 (13:27 IST)
FILE
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంకూడా కన్నతల్లి లాంటిదేనని, ఆ తల్లిపై చూపించాల్సింది కనికరం కాదు సేవ అని మోడీ వ్యాఖ్యానించారు.

అద్వానీ గురించి మాట్లాడుతూ కంటతడిపెట్టిన మోడీ పార్టీ, ఆ పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్‌ల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి నిలబెట్టిందన్నారు.

భారత ప్రజల ఆకాంక్షలే తనను ఇక్కడ నిలబెట్టాయని మోడీ చెప్పారు. బీజేపీ దయవల్లే భరతమాతకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆయన అన్నారు.

భారతదేశానికి స్వాతంత్యం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వారి తరహాలో పాలన సాగించాయని, ముందు ప్రభుత్వాల పాలనలోని మంచిని స్వీకరిస్తామని మోడీ చెప్పారు. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారంటే, అది తమ పార్టీ మీద ఉన్న నమ్మకమేనని ఆయన చెప్పారు.

ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరుస్తామన్న ఆశలు తమపై పెట్టుకున్నారన్నారు. మార్పు కోసం యావత్ భారతదేశం కదిలిందని మోడీ అన్నారు. ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం దేశం కోసం పరితపిస్తోందని ఆయన అన్నారు.

దేశం కోసం నిరంతరం శ్రమిస్తానని మోడీ తెలిపారు. తనలాంటి నిరుపేదను అందలమెక్కించిన ప్రజాస్వామ్య వ్యవస్థ మనదని మోడీ చెప్పారు. పేదల ఆకాంక్షలను నెరవేర్చేదే నిజమైన ప్రభుత్వమని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి