జగన్ సీఎం అయితే తెలంగాణ నోట్లో మట్టే... కేసీఆర్

సోమవారం, 10 డిశెంబరు 2012 (20:50 IST)
FILE
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల నొట్లో మట్టి కొడతాడని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రెండేళ్లలో పోలవరం కడతాడని విజయమ్మ కబుర్లు చెపుతున్నారనీ, ఇవన్నీ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు చెపుతున్న మాటలని ఆయన కొట్టి పారేశారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్ర బడ్జెట్ రూ. 85 వేల కోట్ల బడ్జెట్ ఉంటుందని చుక్కలు చూపిస్తూ చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... వలసవాదులు తెలంగాణను దోచుకునేందుకు అనునిత్యం ప్రణాళికలు రచిస్తూనే ఉంటారనీ, వారి మాటలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డిసెంబరు 28న జరిగే అఖిలపక్షంలో కాంగ్రెస్, తెదేపా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోతే భూస్థాపితం చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెరాస 100 ఎమ్మెల్యే సీట్లను, 15 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తమ సత్తాతోనే తెలంగాణ వచ్చే దాకా అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు కేసీఆర్.

వెబ్దునియా పై చదవండి