ఆగని దాడులు : మరో ఇద్దరిపై దుండగుల ప్రతాపం

ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం సిడ్నీలో ఇద్దరు భారతీయులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. రద్దీగా ఉండే స్థానిక వ్యాపార కూడలిలో ఇద్దరు భారతీయ యువకులతో గొడవ పెట్టుకున్న ఇద్దరు టీనేజ్ దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం.

దుండగులు బాధితుల తలలపై బీరు సీసాతో కొట్టి గాయపర్చినట్లు న్యూసౌత్‌వేల్స్ పోలీసులు వెల్లడించారు. అయితే బాధితుల పేర్లనుగానీ, జాతీయతనుగానీ వెల్లడించేందుకు వారు ఇష్టపడలేదు. అయితే, టీవీ ఛానళ్లు మాత్రం దాడికి గురైనవారు భారతీయులేనని పేర్కొన్నాయి.

పీక్‌హర్ట్స్, హర్ట్స్‌విలే ప్రాంతాలకు చెందిన 16, 17 ఏళ్ల యువకులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గాయాలపాలైన 20 సంవత్సరాల వయసుగల బాధితులకు సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వారు చెప్పారు. కాగా, సంఘటన జరిగిన ప్రాంతం నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

అలాగే, ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించిన పోలీసులు దుండగులు ఇద్దరిపై చెరో రెండు కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుకావాలన్న షరతుపై వదలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే... శనివారం రోజున గౌల్‌బర్న్ స్ట్రీట్‌లోని నైట్‌క్లబ్బులో ఓ సెక్యూరిటీ ఉద్యోగి కొంతమందిపై దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి