ఎన్నారై శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం

హూస్టన్‌లోని రైస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తగా ఉన్న భారతీయ అమెరికన్ క్రిష్ణ పాలెంను అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ)" కంప్యూటర్ సొసైటీ క్రిష్ణకు "వాలస్ మెక్‌డోవెల్" అవార్డును బహూకరించింది.

"ఎమ్‌బెడెడ్ కంప్యూటింగ్"లో క్రిష్ణ అందించిన సేవలకుగానూ 2008 సంవత్సరానికి ఐఈఈఈ వాలస్ పురస్కారానికి ఎంపిక చేసింది. మైక్రో ప్రాసెసర్ సృష్టికర్త ఫెడెరికో ఫాగిన్, వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బెర్నర్స్-లీ లాంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకోగా, తాజాగా క్రిష్ణ ఆ ఘనతను సొంతం చేసుకున్నారు.

క్రిష్ణ సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ విశ్వ విద్యాలయం (ఎన్‌టీయూ)లో "ఇనిస్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ నానో ఎలక్ట్రానిక్స్" విభాగం అధిపతిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన కృషితో కార్లు, పిల్లలాడుకునే బొమ్మల్లోనూ ఉంచే కంప్యూటర్ల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.

క్రిష్ణ పాలెం సాగించిన పరిశోధనలు కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 2007లో ఆయన రైస్ యూనివర్సిటీలో చేరారు. డిజైన్, ప్రొడక్షన్ ఖర్చు తగ్గింపు, తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచే మైక్రో చిప్ తయారీ లాంటి లక్ష్యాలతో రైస్, ఎన్టీయూ సంయుక్త భాగస్వామ్యంతో పరిశోధనలు గావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి