రెండు నెలల సెలవుపై వెళ్లనున్న సామివేలు

మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామివేలు.. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టి, నాయకత్వ మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత ఆయన సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం.

ఈ విషయమై సామివేలు మీడియాతో మాట్లాడుతూ.. తాను విశ్రాంతి తీసుకునే తేదీలు ఇంకా ఖరారు కాలేదనీ, ఒకవేళ తాను సెలవుపై వెళితే పార్టీ కార్యక్రమాలను జి. పలనివేల్ సమర్థవంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. భారత్‌నుంచి మరిన్ని ప్రాథమిక సదుపాయాల ప్రాజెక్టులను మలేషియా కంపెనీలకు వచ్చేలా తాను కృషి చేస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇకపోతే.. ఎంఐసీ మాజీ ఉపాధ్యక్షుడు వి. గోవిందరాజ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పార్టీ డిసిప్లీనరీ కమిటీ నిర్ణయించినట్లు సామివేలు ఈ సందర్భంగా వెల్లడించారు. పార్టీ ఇమేజ్ గోవిందరాజ్ దెబ్బతీశారన్న ఆరోపణలున్నాయనీ.. అలాగే మాజీ డిప్యూటీ అధ్యక్షుడు ఎస్. సుబ్రహ్మణ్యంపై చర్యలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఇదిలా ఉంటే.. నూతన పార్టీ మక్కల్ శక్తిని ఆవిష్కరించేందుకు ప్రధాని నజీబ్ తున్ రజాక్ అంగీకారం తెల్పడంపై, సామివేలు స్పందించేందుకు నిరాకరించారు. బాగన్ పినాంగ్ ఉప ఎన్నికల్లో పాలక కూటమి అయిన బారిసన్ నేషనల్ పార్టీకి భారతీయుల మద్ధతును కూడగట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. బారిసన్ నేషనల్ పార్టీలో ఎంఐసీ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే..!

వెబ్దునియా పై చదవండి