వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను..?

శుక్రవారం, 10 జనవరి 2014 (14:44 IST)
WD
వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయి. జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదం.

వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదు. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుంది. స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని పండితులు అంటున్నారు. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.

విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించుకుని పూజ చేయాలి.

ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే..?

పూర్వం అసుర బాధలను భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించి, తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడల వదిలించుకున్నారు.

ఉత్తర ద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల ఈ రోజు వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగివచ్చిన మూడుకోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం ముక్కోటి ఏకాదశిగాను పిలువబడుతోంది.

వెబ్దునియా పై చదవండి