శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం ఎక్కడ ఉంది...?

FILE
మన రాష్ట్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సింహాచలంలో ఉంది. విశాఖపట్నం నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి, అతనిపై నరసింహస్వామివారికున్న దయకు నిదర్శనంగా నిలిచింది.

శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం దేశంలోని అతి పురాతన ఆలయాలలో ఒకటి. ఇది 11వ శతాబ్దం నుంచి వెలుగులోకి వచ్చింది. ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండడం వల్ల దీనిని సింహాచలం అని పేరు వచ్చిందిని చెబుతారు. పురూరవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడని అంటారు. అతి పురాతనమైన ఈ దివ్యాలయ శోభవర్ణనాతీతం.

మనోహరమైన శిల్పాలు, ప్రాకారాలు, అడుగడుగునా దర్శనమిస్తాయి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు సంవత్సరమంతా చందనంతో నిండి ఉంటారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే చందనం తొలగించిన స్వామివారి నిజస్వరూప దర్శనం కలుగుతుంది. స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగించే ఉత్సవాన్ని చందనోత్సవం అని పిలుస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకుల్లో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటారు.

ఇదే ఆలయ ప్రాంగణంలో కప్పు స్తంభం ఉంది. ఇది కోర్కెలను తీరుస్తుందని అంటారు. సింహాచలంలో చూడాల్సిన దేవాలయాలు, మందిరాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి సిటిబస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి