ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు ఏం పాపం చేశారు : బండి సంజయ్

ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:37 IST)
తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతికి ఈడబ్ల్యూఎస్ కోటాకు చెందిన అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో ఎందుకు మినహాయింపు ఇవ్వరని తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. 
 
ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎందుకివ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ నోటిఫికేషన్‌ను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు