కేసీఆర్ కుమార్తె కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు - మొబైల్స్ స్వాధీనం

ఠాగూర్

శుక్రవారం, 15 మార్చి 2024 (16:56 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు చేసి, కీలకమైన పత్రాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం స్కామ్‌లో కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని ఈడీ అధికారులు అధికారులు అరెస్టు చేశారు. అలాంటి వారిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఒకరు. ఈయన గత యేడాదికి పైగా జైల్లో ఉంటున్నారు. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయన వద్ద ఈడీ విచారణ జరిపేందుకు పలుమార్లు సమన్లు జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బంజారా‌హిల్స్‌లోని కవిత నివాసంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా మొత్తం 8 మంది అధికారుల బృందంతో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ న్యాయవాద విభాగం కన్వీనర్ సోమ భరత్, లాయర్లు కవిత నివాసానికి చేరుకోగా, ఈడీ అధికారులు వారిని ఎవ్వరినీ కవిత ఇంట్లోకి అనుమతించలేదు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కవిత నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. 
 
ఇదిలావుంటే, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్​కుమార్, ప్రశాంత్ రెడ్డిలు ఆయనతో భేటీ అయ్యారు. కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు