బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

వరుణ్

మంగళవారం, 23 జనవరి 2024 (08:39 IST)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అయోధ్య నగరానికి ప్రత్యేక రైళ్లను నడుపనుంది. బీజేపీ తెలంగాణ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 200 మంది కార్యకర్తలకు ఈ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటులను కల్పించనుంది. ఒక్కో రైలుకు 20 బోగీలు ఉంటాయని, ఒక్కో రైలులో 1400 మంది ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ రైళ్లు వివిధ తేదీలలో సికింద్రాబాద్, కాజీపేట్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. 
 
ఈ ప్రత్యేక రైళ్లు ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన భక్తులతో ఒక్కో రోజున బయలుదేరి వెళతాయి. మొదట సికింద్రాబాద్ లోక్‌‍సభ నియోజకవర్గం నుంచి ఈ నెల 29వ తేదీన బయలుదేరి వెళుతుంది. ఆ తర్వాత జనవరి 30న వరంగల్, జనవరి 31న హైదరాబాద్, ఫిబ్రవరి 1న కరీంనగర్, ఫిబ్రవరి 2న మల్కాజిగిరి, ఫిబ్రవరి 3న ఖమ్మం, ఫిబ్రవరి 5న చేవెళ్ల, ఫిబ్రవరి 6న పెద్దపల్లి, ఫిబ్రవరి 7న నిజామాబాద్, ఫిబ్రవరి 8న ఆదిలాబాద్, ఫిబ్రవరి 9న మహబూబ్ నగర్, ఫిబ్రబవరి 10న మహబూబాబాద్, ఫిబ్రవరి 11న మెదక్, ఫిబ్రవరి 12న భువనగిరి, ఫిబ్రవరి 13న నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 14న నల్గొండ, ఫిబ్రవరి 15వ తేదీ జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరి వెళుతుంది. 
 
ఈ రైళ్లలో అయోధ్యకు వెళ్లాలని భావించే భక్తులు సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కాల్సివుంటుంది. అలాగే నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలకు చెందిన వారు కాజీపేటలో రైలు ఎక్కాల్సి ఉంటుంది. అయోధ్యకు వెళ్లే కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర నేతలు ఎంపిక చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు