దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి పులివెందుల శాసనసభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.గోపాల్ శనివారం పులివెందులలో అధికారికంగా ప్రకటించారు.
అందరూ ఊహించినట్లుగానే వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనారని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకిటంచిన నేపథ్యంలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఒక్కరే నామినేషన్ వేశారని, దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తాము ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా వైఎస్ విజయ లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వైఎస్ సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డి అందుకున్నారు.