రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామల గొడవ మొదలైంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసాయి. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా వచ్చిన వరద ఉన్న భద్రాచలం జిల్లాలోని అనేక లోతట్టు గ్రామాలు నీట మునిగిపోయాయి. అలాగే, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఐదూళ్ళ రచ్చ తలెత్తింది. ఇది కొత్త చర్చకు దారితీసింది. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ప్రాంతాలు ఉన్నాయ. ఈ గ్రామాల గురించే ఇపుడు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేశారు. అందులోభాగంగా ఈ ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఐదు పంచాయతీలు భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమైంది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో బద్రాచలం రూరల మండలం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలను, అలాగే, పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వారావుపేట సెగ్మెంట్లో కకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు.
అయితే, ఈ ఐదు గ్రామాల్లో పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీల వార్డులు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయ్. కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు… అటు తెలంగాణ, ఇటు తెలంగాణ మధ్య ఆంధ్రాలో ఉన్నాయి.
భద్రాచలం నుంచి చర్ల జాతీయ రహదారి వైపునకు, పర్ణశాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా, ఏపీ పరిధిలోని ఈ మూడు పంచాయతీలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వివాదాలు ఎన్నో ఉన్నా ఈ మధ్య భద్రాచలం చుట్టూ కనిపించిన వరదలు కొత్త చర్చకు దారి తీసేలా చేశాయి.